ప్రమాణ స్వీకారం తర్వాతే మాట్లాడుతా: రాజ్యసభ సభ్యత్వంపై మాజీ సీజేఐ

  • రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
  • రేపు ఢిల్లీ రానున్న సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి
  • గతేడాది నవంబర్‌‌లో పదవీ విరమణ చేసిన గొగోయ్‌
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌ను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి విదితమే. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, రాష్ట్రపతి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చిందో ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే వివరంగా చెబుతానని జస్టిస్ గొగోయ్ అంటున్నారు.

‘నేను రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. మొదట నన్ను ప్రమాణ స్వీకారం చేయనీయండి. ఆ తర్వాతే మీడియాతో మాట్లాడుతా. ఈ సభ్యత్వాన్ని ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో స్పష్టంగా చెబుతా’ అని గొగోయ్ తెలిపారు. దాదాపు 13 నెలల పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన రంజన్‌ గతేడాది నవంబర్‌‌లో పదవీ విరమణ చేశారు.

ఇప్పటిదాకా మరే సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి..  రాజ్యసభకు నామినేట్ చేయలేదు. అయితే, కొంతమంది న్యాయకోవిదులు మాత్రం పెద్దల సభలో అడుగుపెట్టారు. కొన్ని దశాబ్దాల క్రితం.. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా కాంగ్రెస్‌లో చేరి ఆ తర్వాత పార్లమెంట్‌ సభ్యుడయ్యారు. 1991లో రిటైర్ అయిన ఆయన 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

Ex Chief Justice Gogoi
Rajya Sabha Nomination
Supreme Court

More Telugu News